సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Thursday, April 2, 2009

మార్క్సిస్టు మహా రథికుడు ఇ.ఎం.ఎస్‌. - తెలకపల్లి రవి


రవయ్యో శతాబ్ది ప్రపంచ రాజకీయ యవనికపై ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ది విలక్షణ స్థానం. ఎన్నికల బాటపట్టి ముఖ్యమంత్రి పీఠమెక్కిన మొదటి కమ్యూనిస్టుగా ఇ.ఎం.ఎస్‌. చరితార్థుడు. కాంగ్రెస్‌ గుత్తాధిపత్యానికి తొలి గండి కొట్టిన ఉద్దండుడు. సిద్ధాంతకర్తగా, పాలనావేత్తగా బహుముఖ ప్రజ్ఞ కనబరచి కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త వూపిరులూదిన నంబూద్రి సిసలైన మహారథికుడు.

లంకులం మనక్కర్‌ శంకర నంబూద్రిపాద్‌... దేశంలో అరవయ్యేళ్లపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ పేరు జీవనాడి. డెబ్భై ఏళ్ల కిందటే ఎన్నికల్లో పోటీచేసి 1939లో కేరళ శాసనసభకు ఎన్నికైన సముజ్వల అరుణతార ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌. సనాతన ఆచార వ్యవహారాలకు కట్టుబడిన, సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఇ.ఎం.ఎస్‌. అలుపులేని సేవానిరతితో కేరళ ప్రజలకు ప్రియతమ నాయకుడయ్యారు. ఇ.ఎం.ఎస్‌. 1909 జూన్‌ 14న కేరళ దక్షిణ మలబార్‌ ప్రాంతంలోని ఎలంకులం గ్రామంలో జన్మించారు. వేద విద్యలను నిష్ఠగా అభ్యసించిన బాల్యం నంబూద్రిది. సోదరుడితోపాటు 1925లో పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టిన తరవాతే సమాజ స్థితిగతులపై ఆయనకు అవగాహన పెరిగింది. క్రమంగా ఆయన సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటంపట్ల ఆకర్షితులయ్యారు. 1932లో కళాశాల విద్యకు మధ్యలోనే స్వస్తి పలికి జాతీయోద్యమ పథం పట్టారాయన. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అక్కడే ఆయనకు కేరళ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు కృష్ణపిళ్త్లెతో, బెంగాల్‌కు చెందిన విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. జైలునుంచి విడుదయ్యాక కాంగ్రెస్‌లోని వామపక్షంవైపు ఇ.ఎం.ఎస్‌. దృష్టిసారించారు.

శ్రామిక ప్రజల దత్త పుత్రుడు
కాంగ్రెస్‌లో అంతర్భాగంగా 1934లో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఆవిర్భవించినప్పుడు నంబూద్రి దాని ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు. మద్రాసులో కృష్ణపిళ్త్ల్లెె, సుందరయ్యలతో 1935లో సుదీర్ఘ చర్చలు జరిపిన తరవాత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు ఆయన నడుం బిగించారు. అప్పుడు దానిపై నిషేధం ఉంది. వైనాడ్‌లో పేదల ఇళ్లలో గడిపి వారి పరిస్థితుల పట్ల ప్రత్యక్ష అవగాహన ఏర్పరచుకున్నారు. సంపన్న సనాతన కుటుంబంలో పుట్టినా- తాను శ్రామిక ప్రజల దత్త పుత్రుడనేనని సగర్వంగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున 1939లో మద్రాసు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ శాసనసభ కొద్ది కాలమే ఉంది. స్వల్పకాలంలోనే బాధ్యతల నిర్వహణలో భాగంగా కౌలుదార్ల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి వారి విముక్తికి ఉపయోగపడే నివేదికను రూపొందించారు నంబూద్రి. కృష్ణపిళ్త్లె 1940లో అరెస్టు కావడంతో ఇ.ఎం.ఎస్‌. రాష్ట్ర కమ్యూనిస్టు కార్యదర్శిగా ఎంపికయ్యారు. తనపై అరెస్టు వారెంటు ఉన్నా, నత్తి కారణంగా ఎవరైనా తనను తేలిగ్గా పట్టుకునే అవకాశం ఉన్నా చివరివరకూ దొరక్కుండా అజ్ఞాతవాసం గడిపారు. రహస్య జీవితంలోనే మార్క్సిస్టు గ్రంథాలను, సాహిత్య పుస్తకాలను విపరీతంగా చదివారాయన. కేరళ సమాజ స్థితిగతులు, ఆర్థిక రాజకీయాంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన తన జీవిత పర్యంతం అధ్యయన శీలతను మాత్రం వీడలేదు. అసంఖ్యాకంగా పుస్తకాలు చదువుతూ విస్తృతంగా రచనలు చేశారాయన. ప్రజా ఉద్యమాల్లో క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ అంత విస్తారంగా రచనలు చేసిన నాయకుడు దేశంలో మరొకరు కనిపించరు.

భూ సంస్కర్త
మద్రాసు శాసనసభకు 1952 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నంబూద్రి కొన్నేళ పాటు ఢిల్లీలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆ సందర్భంగా అనేక విషయాలను ఆకళింపు చేసుకున్నారు. విదేశీ ప్రతినిధులతో తరచూ సమావేశాలలో పాల్గొనడంవల్ల అంతర్జాతీయ ఉద్యమంతోనూ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యమే ఆయనకు 1957 ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్‌పై ఘనవిజయం సాధించి పెట్టింది. అధికారంలోకి రాగానే భూ సంస్కరణలను అమలు చేశారు. భూస్వామ్య వ్యవస్థ నడ్డి విరిచేశారు. కార్మికోద్యమాలు, ప్రజాందోళనలపట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించడాన్ని ఇ.ఎం.ఎస్‌. తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన ప్రభుత్వం ఏర్పరచిన పునాదే నేడు అక్షరాస్యతలో కేరళ దేశంలోనే అగ్రస్థానం సాధించడానికి కారణమైంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను లక్షించి ఇ.ఎం.ఎస్‌ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం ఇచ్ఛగించని మత, వ్యాపార వర్గాలు ఇం.ఎం.ఎస్‌. సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద రభస చేశాయి. నాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఇందిర-నెహ్రూ ఆశీస్సులతో విమోచన ఉద్యమం మొదలుపెట్టారు. ఈ శక్తులకు ఊతంగా నిలిచారు. శాంతి భద్రతలు దిగజారాయన్న మిషతో 356వ అధికరణం ప్రయోగించి 28 మాసాలు పాలించిన ఇ.ఎం.ఎస్‌. ప్రభుత్వాన్ని 1959లో కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రాల హక్కులపై దేశ చరిత్రలో పడిన తొలి వేటు అది.

ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో సైద్ధాంతిక విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అదే సమయంలో కార్యదర్శి అజయ్‌ఘోష్‌ చనిపోయారు. ఆ పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడుగా ఇ.ఎం.ఎస్‌.ను కార్యదర్శిగా, డాంగేను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. కాని ఆ సయోధ్య ఎక్కువకాలం సాగలేదు. తరవాతి కాలంలో సి.పి.ఎం.గా గ్రూపు కట్టనున్న నాయకులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసింది. వారిలో ఇ.ఎం.ఎస్‌. కూడా ఉన్నారు. అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో కొద్ది కాలంలోనే ఆయనను మాత్రం విడుదల చేశారు. 1964లో సి.పి.ఎం. ఏర్పడినప్పుడు తొలి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన సైద్ధాంతిక మార్గదర్శిగా ఇ.ఎం.ఎస్‌. అసమాన ప్రజ్ఞ కనబరచారు. 1965లో కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. కానీ- సి.పి.ఎం. తరఫున ఎన్నికైన వారంతా జైళ్లలో ఉండటంవల్ల ప్రమాణ స్వీకారం చేయడం కుదరలేదు. దానితో ఎన్నికలనే రద్దు చేశారు. అనంతరం 1967లో మరోసారి ఆయన వామపక్ష సంఘటన తరఫున కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వం ఇంచుమించుగా మూడేళ్లు ఉంది. గతంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అనేక ప్రజానుకూల విధానాలను ఆ సందర్భంగా ఇ.ఎం.ఎస్‌. పరిపూర్తి చేశారు. ఏడో దశకంలో రెండు పర్యాయాలు కేరళ శాసనసభకు ఎన్నికైనప్పటికీ ఇ.ఎం.ఎస్‌. ప్రధానంగా జాతీయస్థాయిలో సి.పి.ఎం. నాయకత్వ బాధ్యతలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. పార్టీలో సైద్ధాంతిక వివాదాలు తీవ్రమవుతున్న కాలమది. మరోవంక ఇందిర ఏకపక్ష నిరంకుశ రాజకీయాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వీటిని ఎదుర్కోవడంలో ఇ.ఎం.ఎస్‌. కీలకపాత్ర వహించారు. మలయాళంలో పార్టీ పత్రికలతో ఇ.ఎం.ఎస్‌.కు ప్రగాఢ అనుబంధం ఉంది.కేంద్ర పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీకి సైతం ఆయన సంపాదకుడుగా వ్యవహరించారు. ఇ.ఎం.ఎస్‌. ఎమర్జెన్సీ కాలంలోనూ ఇందిర నిరంకుశంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్త్రతంగా పర్యటించారు. ఆంధ్రలోని కమ్యూనిస్టు ఉద్యమంతో ఇ.ఎం.ఎస్‌.కు ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు.

రాష్ట్రాల హక్కుల కోసం
1977 నుంచి 1992 వరకూ సి.పి.ఎం. ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జాతీయ రాజకీయాలలో ఆయన మాటకు ప్రత్యేకమైన విలువ ఉంది. మరోసారి 1980లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడినా నంబూద్రి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోలేదు. ఆ తరవాత కాలంలో ప్రధానంగా ఆయన మతతత్వ రాజకీయాలను అడ్డుకోవడంపై దృష్టిపెట్టి పనిచేశారు. అంతకు ముందు కేరళలోని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముస్లింలీగ్‌ వర్గాలు కూడా ఐక్యసంఘటనలో కలిసి ఉండేవి. 1987 ఎన్నికలకు ముందు నంబూద్రి మతశక్తుల ప్రమేయంలేని ప్రభుత్వ ఏర్పాటును లక్షించారు. అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అధ్యయనం, ఉద్యమ నిర్మాణంపై ఆయనది ప్రత్యేక దృష్టి. మొదటి నుంచి ఆయన రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతూ వచ్చారు. చివరి దశలో ప్రజాప్రణాళికా విధానాన్ని తీసుకొచ్చారాయన. తద్వారా పాలనా వికేంద్రీకరణకు బాటలు పరచారు.

నంబూద్రిని ప్రేమించని మలయాళీ అంటూ నాకెవరూ కనిపించలేదు అని ప్రసిద్ధ పాత్రికేయుడు ఎ.ఎస్‌. రామన్‌ ఒకసారి అన్నారు. ఆయన కేరళ రాజకీయాలలో భీష్మపితామహులు. ఎన్ని ఉన్నత స్థానాలు అలంకరించినా వ్యక్తిగత జీవితంలో మచ్చలేని నిష్కంళక వ్యక్తి. మాట్లాడినా రాసినంత స్పష్టంగా ఉండే ఆయన శైలి అనేక సభల్లో ఆయన ప్రసంగాలను అనువదించిన ఈ వ్యాసకర్తకు సుపరిచితం. చిన్నప్పటినుంచి నత్తి వెంటాడుతున్నా ఖాతరుచేయని దీక్షాదక్షులు. ఆయన నడక సైతం చాలా నెమ్మది. మాటల తూటాలను ఆయన శ్రామికవర్గ ఉద్యమానికి వెలుగు దీపాలుగా ప్రయోగించారు. ఎన్నికల ద్వారా వచ్చిన తొలి కమ్యూనిస్టును తానుకానని, గుయానా అధ్యక్షుడు చెడ్డీ జగన్‌కే ఆ ఘనత దక్కుతుందని స్వయంగా ప్రకటించిన చారిత్రక దృష్టి, వినమ్రత ఆయనది.

ఇ.ఎం.ఎస్‌. ఆజన్మాంతం నిక్కమైన కమ్యూనిస్టుగానే గడిపారు. అధ్యయనం ఆయన వ్యక్తిత్వానికి కొత్త సొబగులద్దింది. నూతన సామాజికాంశాలను గ్రహించడంలో ఆయనది అందెవేసిన చేయి. సిద్ధాంతాన్ని సృజనాత్మకంగా అన్వయించగల మేధావి ఆయన. పొరబడితే బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకోవడానికీ వెనుకాడరు. ఆయన గొప్ప హాస్యచతురులు కూడా. తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత లండన్‌ టైమ్స్‌ విలేకరి ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చారు. మీకు ఎప్పుడూ నత్తి ఉంటుందా అంటూ ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు 'లేదు మాట్లాడినప్పుడే' అని ఆయన చమత్కారంగా బదులిచ్చారు. వి.పి.సింగ్‌ ప్రభుత్వం మరెన్ని రోజులుంటుంది అన్న మరో ప్రశ్నకు ఆ ఊహాగానాలు నా పనికాదు, 'మీ పత్రికల గుత్తసొమ్ము' అంటూ ఠక్కున జవాబు చెప్పారాయన. ఇందిర హయాంలో జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఒక సందర్భంలో ఆయన 'థాంక్‌ గాడ్‌' అన్నారట. పక్కనే ఉన్న జగ్జీవన్‌ రాం 'దేవుడిపై మీకు ఎప్పుడు విశ్వాసం ఏర్పడింద'ని అంటే- 'దెయ్యాలను చూసినప్పుడల్లా నాకు దేవుడు గుర్తుకొస్తాడు' అని చమత్కరించారాయన. ఇవన్నీ ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనాలు. ఆయన ఆత్మకథకు మలయాళంలో ఉత్తమ సాహిత్య గ్రంథం అవార్డు లభించింది. జీవితం చరమదశలో మలయాళ పత్రిక 'దేశాభిమాని' గౌరవ సంపాదక బాధ్యతలు మరోసారి స్వీకరించి చివరి వరకూ రచనలు చేస్తూనే గడిపారు. అన్ని బాధ్యతలమధ్యా మతిస్థిమితం లేని సతీమణిని శ్రద్ధగా చూసుకున్నారు.

1998 మార్చి 19 తిరువనంతపురంలో తన 89వ ఏట కన్నుమూసిన ఇఎంఎస్‌కు అన్ని పార్టీల నాయకులు నివాళులర్పించడం ఆయన ప్రత్యేకతను తెలుపుతుంది. ఇటీవల వెలువడిన తన జీవిత చరిత్రలో భాజపా నేత అద్వానీ... హోం మంత్రిగా తను చేసిన మొదటి పని నంబూద్రిపాద్‌కు నివాళులర్పించడమేనని రాయడం విశేషం. నంబూద్రి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ ఏడాది ఆయన సిద్ధాంతాలను స్మరించుకోవడం ఎంతైనా సమంజసం.

- తెలకపల్లి రవి

No comments:

Post a Comment