సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Wednesday, April 1, 2009

ఉద్యమాలేమా ఊపిరి - బి.వి.రాఘవులు


దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసేతర లౌకిక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలనే దాని నిబద్ధ కృషిని అడ్డుకోనూ లేవు. ప్రజాస్వామిక లౌకిక సంప్రదాయాలకు పెట్టింది పేరైన తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన తీర్పునిచ్చి కాంగ్రెస్‌ అవినీతి పాలనను అంతం చేస్తారని మా దృఢ విశ్వాసం. అలాగే మా పార్టీ ప్రాతినిధ్యం పెంచుకుని ప్రజల పక్షాన నిలబడతాం.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా కీలకమైన ఎన్నికల పోరాటం జరుగుతున్నది. ఉన్న అధికారాన్ని ఎలాగై నా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌, పోయిన అధికారాన్ని తిరిగి రాబట్టుకోవాలని బిజెపి నానా విన్యాసాలు చేస్తున్నాయి. గత ఐదేళ్లుగా యుపిఎ హానికర విధానాలను తిరస్కరించేందుకు ప్రజలకు లభించిన అవకాశమే ఈ ఎన్నికలు. మరోవైపు పచ్చి మతోన్మాద విధానాలతో మంటలు పెట్టి దేశ లౌకిక సం ప్రదాయాలను నాశనం చేసే ప్రమాదకర శక్తి బిజెపిని తిరస్కరించకపోతే వైవిధ్య భరితమైన ఈ దేశపు అస్తిత్వానికే ముప్పు. అందుకు ఈ రెండు శక్తులనూ తోసిపుచ్చి వివిధ లౌకిక పక్షాలతో కూడిన తృతీయ ప్రత్యామ్నాయ శక్తిని కేంద్రంలో ప్రతిష్టించితేనే దేశ భద్రతకూ ప్రజల ప్రయోజనాలకూ రక్షణ లభిస్తుంది.

ఉగ్రవాదం, మతోన్మాదం దేశ భద్రతకు పెద్ద సవాళ్లుగా తయారైనాయి. ప్రపంచాన్ని ఆవరించి న ఆర్థిక సంక్షోభం తాకిడికి సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలూ వృత్తి నిపుణులూ కూడా కుదేలవుతున్న పరిస్థితి. యుపిఎ ప్రభుత్వాన్ని బయటనుంచి బలపరిచిన వామపక్షాల ఒత్తిడి, పోరాటాల కారణంగానే దాని ప్రైవేటీకరణ దూకుడుకు కొంతైనా పగ్గాలు పడ్డాయి. ఉపాధి హామీ పథకం, ఆరోగ్య పరిరక్షణ మిషన్‌, అటవీ హక్కుల చట్టం, నవరత్నాల పరిరక్షణ వంటి చర్యలు సాధ్యమైనాయి. ఈ ప్రత్యామ్నాయ పోరాటమే లేకపోతే దేశం మరింతగా ఆర్థిక సంక్షోభపు తాకిడికి అతలాకుతలమై ఉండేది. అందుకే కాంగ్రెస్‌, బిజెపిలను నిరోధించి తృతీయ ప్రత్యామ్నాయాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసుకోవలసి ఉంది.

మూడు రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం తక్కిన వామపక్షాలతో పాటు అలాంటి ప్రత్యామ్నాయానికై ఎంతగానో చొరవచూపుతున్నది. ఎన్‌డిఎ, యుపిఎ కూటములు విచ్ఛిన్నమై భాగస్వాములను కోల్పోతుంటే తృతీయ కూటమిలోకి బలీయమైన ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరుతున్నాయి. మొదట ఇది ఆచరణ సాధ్యం కాదన్న వారే ఇప్పుడు దాని అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ముందు ముందు ఇది ఇంకా బలపడడం తథ్యం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను చూడాల్సి ఉంది. ఐదేళ్ల కిందట సిపిఎం వామపక్షాలు సాగించిన ప్రజా ఉద్యమాల భూమికపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ లక్ష్యాలను పూర్తిగా వమ్ము చేసింది.

వినాశకరమైన ప్రపంచ బ్యాంకు విధానాలనే మరింత గట్టి గా లోపాయికారిగా అమలు చేసింది. జీవో నెంబర్‌ 5 వంటి పన్నుల పెంపు, కార్పొరేట్‌ ప్రధానమైన ఆరోగ్య విధానం, విద్యా రంగంలో పూర్తి వాణిజ్యీకరణ, హద్దూ అదుపులేని బెల్టుషాపులతో మద్య ప్రవాహాలు పారించడం ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం వినాశకర విధానాలనే అనుసరించింది. భూ పంపిణీకి సంబంధించి మేము చేసిన నిర్దిష్ట ప్రతిపాదనలను విస్మరించడమే కాక రకరకాల పేర్లతో ధనస్వాములకు విలువైన యాభైవేల ఎకరాలకు పైగా కట్టబెట్టింది. భూముల మాయాజాలంలో సామాన్య ప్రజలే సమిధలయ్యారు. ప్రజా ప్రభంజనంగా సాగిన భూ పోరాటంపై తూటాల వర్షం కురిపించి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది. మహిళలతో సహా వేలాది ప్రజలపై లాఠీచార్జి చేసి వందల సంఖ్యలో ఆందోళనకారులను జైళ్లలో పెట్టింది. తోటపల్లి, భద్రాచలం, గంగవరం ఇలా నిర్వాసితులు, బాధితులపై తూటాలు కురిపించి రాక్షసత్వం చాటుకున్నది.

ఆఖరుకు ఎరువులు విత్తనాల కోసం వీధుల్లోకి వచ్చిన రైతులపైనా కాల్పులకు పాల్పడింది. 4000మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదు. వెయ్యిమంది చేతివృత్తిదార్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందన లేదు. పాలనా పీఠమైన సచివాలయం ఎదుట ఉన్న లుంబిని పార్కుతో సహా పలుచోట్ల భయానకమైన బాంబు పేలుళ్లు సంభవించినా ఆచూకి పట్టుకున్న దాఖలాలు లేవు. ఆయేషా అమానుష హత్యతో సహా అనేక అఘాయిత్యాలు జరిగినా జవాబుదారీ గా నిలిచిన పాపానపోలేదు. ఆఖరుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో జైళ్లలోనే హత్యలు జరిగినా సంజాయిషీ లేదు. ఒక్క ముక్క లో చెప్పాలంటే నేరస్థ శక్తుల ఇష్టారాజ్యం నడుస్తున్నది. ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆకాశపుటంచులు దాటింది.

వోక్స్‌వ్యాగన్‌, డిపెప్‌, ఎలుగుబంటి.. ఇలా చెప్పా లంటే ప్రతిదీ ఒక కుంభకోణమే. ప్రభుత్వ లాలూచీతో అక్ర మ పద్ధతుల్లో వ్యాపారాలు పెంచుకునే క్రోనీ పెట్టుబడిదారీ విధానానికి రాష్ట్రం అడ్డాగా మారింది. సత్యం మేటాస్‌ కుంభకోణం ఇందుకు పెద్ద ఉదాహరణ. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడి సంస్థల్లోకి అనుమానాస్పద పద్ధతుల్లో అనూహ్యమైన మార్గాలలో భారీ పెట్టుబడులు సమకూరిన తీరు సాక్ష్యాధారాలతో సహా బయటకొచ్చింది. దీనిపై చెంపలు వేసుకుని సంజాయిషీ ఇవ్వడానికి బదులు ఎదురుదాడితో పబ్బం గడుపుకోవాలని చూడడం హాస్యాస్పదం. ఐదేళ్లు అధికారంలో ఉన్నవారు ఎవరి విషయంలోనైనా ఏ చర్యయినా తీసుకుని నిజానిజాలు నిగ్గు తేల్చివుండొచ్చు. అంతేగాని తమ పై ఆరోపణలు దారి తప్పించేందుకు మరెవరిపైనో దాడి చేసి ప్రజలను మోసగించలేరు. అలాగే తెలంగాణ సమస్యపై కాంగ్రెస్‌ రకరకాల మాటలు మార్చి రాజకీయ లబ్ధికోసం పాకులాడి న తీరు సిగ్గుచేటు.

కాంగ్రెస్‌ తన కుటిల నాటకానికి సిపిఎం వైఖరిని కారణంగా చూపించడం కపటత్వం మాత్రమే. కొత్త శాసనసభ తీర్మానం చేస్తే పార్లమెం టు దానిపై తగు నిర్ణయం తీసుకోవచ్చు. అంతేగాని ఈ సమయంలో తలాతోక లేని రోశయ్య కమిటీ అంటూ రాజకీయ ప్రహసనం నడిపించడం, ప్రజల మనోభావాలతో చెలగాటమాడడం తగని పని. ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఎన్నో మేళ్లు చేసిందని ముఖ్యమంత్రి ఊదరగొడుతుంటారు. కాని ఏ రంగంలోనూ ఏ తరగతి వారికి సంబంధించిన మౌలిక విధానపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. ప్రజా ఉద్యమాల ఉధృతికి తట్టుకోలేక పరిపాలన సగం గడిచిన తర్వాత ఏవో మొక్కుబడి పథకాలు అమలు చేసింది. అందులోనూ అందినదానికన్నా అవినీతి పాలు చాలా ఎక్కువ.

ఈ విషయాలపై మా పార్టీ వివిధ రంగాల వారీగా 16 పుస్తకాలు ప్రచురించింది. వాటికి ఇంతవరకూ జవాబు ఇవ్వకపోగా గత ఎన్నికల తరుణంలో మేము ప్రచురించిన పుస్తకాలను పట్టుకొని వూరేగుతున్నా రు. అప్పటి ఆ పుస్తకాలపై ప్రజల తీర్పు వచ్చేసింది. వాటిని పట్టుకొని వేళ్లాడితే ఫలితమేమిటి? అంతకంటే విడ్డూరం సిపిఎం ఎన్నికల ప్రణాళికలోని అంశాలే అమలు చేసినట్టు వారి పత్రికలో రాసుకున్నారు. అలా అయితే రోజూ మాపై దాడులెందుకు? ఉక్రోషమెందుకు? శాసనసభనే బేఖాతరు చేసి దుర్భాషలాడటం, కాగ్‌పైనా కోర్టు పైనా కూడా విరుచుకుపడటం ఎలాంటి నిరంకుశత్వం? ఈ వ్యాస పరంపరలో తొలిరోజున ముఖ్యమంత్రి రాసిన వ్యాసంలో వాడిన భాష కూడా అచ్చంగా అలాగే ఉంది. ప్రతిపక్షాలపైనే గాక మీడియాపై కూడా నిరంతరాయంగా దాడి చేయడంలో ఎమర్జె న్సీ నీలినీడలు తొంగి చూడటం ఎంత అప్రజాస్వామికం? ప్రతిచోటా వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేయడం, నిరసన అనివార్యమై వారు ప్రతిఘటిస్తే నిర్బంధంతో విరుచుకుపడటం నిత్యకృత్యమైంది.

సిపిఎం కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో రాజీలేని పోరాటం చేసింది. ఎల్లవేళలా కష్టజీవుల కోసం సామాన్య ప్రజానీకం కోసం అంకితమైన సిపిఎం ఈ ఐదేళ్లలోనూ ప్రజా సమస్యలను అజెండాలోకి తేవడంలో కీలక పాత్ర వహించింది. వ్యర్థ వివాదాలు, వ్యక్తిగత అంశాల నుంచి విశాల జనబాహుళ్య ఉద్యమాలవైపు నడిపించి సమరశీలతకు మారుపేరుగా అభినందనలు చూరగొన్నది. వైఎస్‌ ప్రభుత్వ నిర్బంధాన్ని నీచ ప్రచారాలను ఖాతరు చేయకుండా ప్రజాబలంతో ప్రతిఘటన సాగించి ప్రత్యామ్నాయానికి ప్రాతిపదిక వేసింది. కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ లౌకిక ప్రత్యామ్నాయానికి అనుకూలంగా స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయింది. ఆ పార్టీ లో చేరిన బిజెపి మాజీ కేంద్ర మంత్రి జాతీయ స్థాయిలో బిజెపి గొప్పదని ఇటీవల కీర్తించడమే ఇందుకు నిదర్శ నం. దేశ వ్యాపిత విధానంలో భాగం గా ఇక్కడ సోదర వామపక్షమైన సిపిఐతోనూ, తెలుగుదేశం, తెరాసలతో నూ అవగాహనకు కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్ల చీలికను నివారించే కృషిచేసింది.

జలయజ్ఞం పేరిట సాగే అవినీతి ని తొలుత స్పష్టంగా ఎత్తిచూపింది సిపిఎం అని అందరికీ తెలుసు. ఇందుకోసం కేసులు నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నా వెనుకంజ వేయలేదు. జలయజ్ఞం పేరిట తాడూ బొంగరం లేకుండా ప్రాధాన్య క్రమం లేకుం డా వేల కోట్లు ధారపోయడం కాంట్రాక్టర్ల మేలుకు తప్ప వ్యవసాయం బాగుకు కాదని ఇప్పటికీ సిపిఎం స్పష్టం చేస్తున్నది. వెనకబడిన ప్రాంతాలకు ముందు ప్రాధాన్యత నివ్వా లి. ఉన్న నిధులతో త్వరితంగా అధికంగా ఫలితాలు రాబట్టే క్రమానుగత వ్యూహం అనుసరించాలి. అంతేగాని నాణ్యత, వాస్తవికత పాటించకుండా ఆశ్రిత అవినీతి కాంట్రాక్టర్ల జేబు లు నింపడం క్షమించరాని నేరం. పోలవరం వంటి చోట్ల మరింత అవాస్తవికంగా అనర్థదాయకంగా నిర్మాణం చేపట్టి గిరిజనుల జీవితాలతో చెలగాటమాడడం సహించరానిది. సెజ్‌ల పేరిట భూములు ధారాదత్తం, బాక్సయిట్‌ నిల్వలను దోచిపెట్టడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎంతైనా నష్టదాయకమైన చర్యలు.

అందుకే సిపిఎం స్వయంగానూ ఇతరులతో పాటు వీటిని అడుగడుగునా ప్రతిఘటించి పోరాడింది. ఇప్పుడు ఎన్నికల పోరాటం దాని కొనసాగింపుగానే సిపి ఎం చూస్తుంది. ఇంతటి అవినీతికి అక్రమాలకు కారణమైన కాంగ్రెస్‌ను గద్దె దించకపోతే రాష్ట్రానికి ప్రజలకు రక్షణ ఉండ దు. ఈ ఎన్నికలు రాజకీయ మార్పుకు నాంది పలకాలి. తర్వాత కాలంలోనూ ప్రజల జీవన స్థితిగతులను శాశ్వత ప్రాతిపదికన మెరుగుపర్చి ఉపాధి కల్పించే విధానాలు సా«ధించుకోవాలి. భూమి, ఉపాధి, గృహ వసతి, ఆహారం, ఆరోగ్యం ప్రజలకు కీలక అవసరాలు. ప్రపంచాన్ని ఆవరించి న ఆర్థిక మాంద్యం చాలా కాలం కొనసాగుతున్న దృష్ట్యా దీర్ఘకాలిక పరిష్కార చర్యలు ఆలోచించాలి. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి.

ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసా రం కొల్లగొట్టడాన్ని అడ్డుకోవాలి. వ్యవసాయానికి ఊపిరిపోయాలి. చేతివృత్తిదార్లకు రక్షణ కావాలి. మహిళలకు భద్రత, భవిత లభించాలి. స్థానిక సంస్థల అధికారాలు, నిధులు పెరగాలి. మితిమీరిన ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలి. అన్ని ప్రాం తాల సమతులాభివృద్ధికి అవసరమైన వ్యూహం అనుసరించాలి. యువతకు ఉపాధి కల్పించి ఉత్సాహ పర్చాలి. వివిధ రకాల మత శక్తుల కుట్రలను తిప్పికొట్టి మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి. మద్యం విశృంఖలత్వాన్ని అడ్డుకోవాలి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలి. మాన వ హక్కులు, ప్రజానుకూల పాలనా సంస్కరణలు, పారదర్శక సమాచార హక్కు వంటివి గట్టిగా అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సాంస్క­ృతిక విలువలు పెంపొందించాలి. గిరిజనులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. మైనారిటీల అభ్యున్నతికి దోహదం చేయాలి. సామాజిక న్యాయం అన్నది నిరర్థక నినాదమని సిపిఎం భావించడం లేదు.

గత ఐదేళ్లలోనూ అంతకు ముందు కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున సైకిల్‌ యాత్రలు, నిరాహార దీక్షలు వగైరా కృషి ఎంతగానో సత్ఫలితాలిచ్చింది. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను నోడల్‌ ఏజెన్సీకి అప్పగించాలని ఆందోళన చేసి పాక్షికంగా సాధించడం జరిగింది. వాటన్నిటినీ ముందుకు తీసుకుపోవడంలో ప్రస్తుత ఎన్నికల పోరాటం కీలకమైన ఘట్టం. అయితే అది మరో పోరాటానికి నాంది వంటిది మాత్రమే. దేశంలో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ అన్నట్టు కమ్యూనిస్టుల విషయం లో ఎన్నికలు ద్వితీయమైనవి, ప్రజా ఉద్యమాలే ప్రథమం. ఉద్యమాల ద్వారా సాధించిన ఫలితాలను పురోగమనాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సాధనంగానే సిపిఎం ఎన్నికలలో పాల్గొంటుంది.

కొంతమంది చౌకబారు విమర్శకులు శాపనార్థాలు పెడుతున్నట్టుగా ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి లేదా తమకు పదవులు సంపాదించుకోవడానికి కాదు. దేశ ప్రధాని పదవినే వదులుకున్న ఏకైక ప్రజా పార్టీని ఇలాంటి నిందారోపణలు ఏమీ చేయలేవు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెసేతర లౌకిక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలనే దాని నిబద్ధ కృషిని అడ్డుకోనూ లేవు. ప్రజాస్వామిక లౌకిక సంప్రదాయాలకు పెట్టింది పేరైన తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన తీర్పు నిచ్చి కాంగ్రెస్‌ అవినీతి పాలనను అంతం చేస్తారని మా దృఢ విశ్వాసం. అలాగే మా పార్టీ ప్రాతినిధ్యం పెంచుకుని ప్రజల పక్షాన నిలబడతాం.

(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శి)

No comments:

Post a Comment